హరి హర వీరమల్లుతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించలేకపోయారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అయితే త్వరలో రిలీజ్ కానున్న ఓజీ సినిమాతో ఫుల్ మీల్స్ కాదు ధమ్ బిరియానీ అందిస్తారని ఆశపడుతున్నారు మెగా ఫ్యాన్స్. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఇటీవల హరి హర వీరమల్లు సినిమతో ఫ్యాన్స్ ను అలరించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. త్వరలోనే ఓజీ అంటూ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. సుజిత్ తెరకక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఓజీ సినిమాలో ప్రియా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రేయా రెడ్డి, వెంకట్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్, మైమ్ గోపీ ఇలా చాలా మంది నటీ నటులు ఈ మూవీలో భాగమయ్యారు. తమన్ స్వరాలు అందించారు. ఇప్పటికే ఓజీ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్, సాంగ్ పవన్ ఫ్యాన్స్ కు అమితంగా నచ్చేశాయి. ముఖ్యంగా రీసెంట్ గానే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫైర్ స్ట్రోమ్ సాంగ్ యూట్యూబ్ రికార్డులను కొల్లగొట్టేస్తోంది. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.



